Monday, September 30, 2019

GRAMASACHIVALAYAM JOBS APPOINTMENT ORDERS



ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను సిద్ధం చేశారు అధికారులు. సోమవారం (సెప్టెంబర్ 30, 2019) అపాయింట్ మెంట్ ఆర్డర్లను అందజేయనున్నారు. విజయవాడలో సీఎం జగన్‌ చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక ప్రతాలు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వనున్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రారంభం కానుంది. ఇకపై స్థానిక సంస్థల్లో పరిపాలనా వ్యవహారాలు వీటి ద్వారానే సాగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కరపలో సచివాలయాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు.

మెరిట్ జాబితాకు ఎంపికైనవారికి సెప్టెంబరు 24 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించారు. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో సెప్టెంబరు 30న ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. వీరికి మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. వీరంతా అక్టోబర్‌ 2న విధుల్లో చేరాల్సి ఉంటుంది. అనంతరం వీరికి అక్టోబరు 14 నుంచి రెండో విడత శిక్షణ ఇవ్వనున్నారు. నవంబరు 15 వరకు దశల వారీగా శిక్షణ ఇస్తారు.

గ్రామ సచివాలయ పోస్ట్ ఆర్డర్స్ జిల్లా పరిషత్ ల నందు ఇస్తూ ఉన్నారు. ఆన్లైన్ నందు అప్లోడ్ చేయలేదుగమనించగలరు.



సెప్టెంబర్ 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లను ఇవ్వడంతోపాటు స్వచ్ఛాంధ్ర కింద మరో రూ.5 కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ నిధులను గ్రామ సచివాలయాల నిర్మాణంతో పాటు అంగన్‌వాడీల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం జగన్‌ ఉద్దేశమన్నారు.

ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి, అన్ని రకాల ప్రభుత్వ సేవలు వాటి ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లోనూ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్పటికే నియమించిన గ్రామ వాలంటీర్లకు తోడుగా మరో 10మంది చొప్పున సిబ్బందిని నియమిస్తున్నారు. ఇందుకోసం ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ విద్యార్హతలు కలిగిన మొత్తం లక్షా 26వేల 728 పోస్టులను భర్తీకి సెప్టెంబర్ మొదటివారంలో పరీక్షలు జరిగాయి.

మొత్తం 10 రకాల పోస్టులు వీటిలో ఉన్నాయి. ఈ పరీక్షలకు 19లక్షల 58వేల 582 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ విభాగాల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి వారిలో లక్షా 98వేల 164 మందిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించింది. కొన్ని పోస్టులకు ఉన్న ఖాళీల కంటే తక్కువ మంది అర్హత సాధించగా, మరికొన్ని పోస్టులకు గట్టి పోటీ ఏర్పడింది. ఎంపికైన వారికి రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారు. అక్టోబర్ 2న విధుల్లోకి తీసుకుంటారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను 72 గంటల్లో అందిస్తారు. ప్రస్తుతం వార్డు సచివాలయాల్లో 10 సేవలను ప్రారంభిస్తామన్నారు. తర్వాత దశల వారీగా సేవల సంఖ్య పెంచుతారు. ఒక్కో వార్డు సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉంటారు. వారిలో పరిపాలన కార్యదర్శి ‘స్పందన’ కార్యక్రమంతో పాటు ఇతర సేవలను పర్యవేక్షిస్తారు.

0 comments:

Post a Comment