Tuesday, July 30, 2019

GRAMA SACHIVALAYA PREPARATION PLAN

GRAMA SACHIVALAYA PREPARATION PLAN 


 గ్రామ  మరియు వార్డ్  సచివాలయ  పరీక్షలకు నాలుగంచెల ప్రణాళిక


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. వీటిల్లోకి అవసరమైన సిబ్బంది కోసం భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. అక్టోబరు 2 నాటికి ఈ ఉద్యోగులు విధుల్లో ఉండాలని భావిస్తోంది. అంటే ఈ పరీక్షలకు హాజరయ్యేవారు అరవై రోజుల్లో సర్కారీ కొలువులో చేరిపోవచ్చు. రాత పరీక్షకు నెలరోజుల సమయమే ఉంది. లక్షలమందితో జరిగే పోటీలో నిలవాలంటే తాజా అభ్యర్థులు, సీనియర్లు తగిన ప్రిపరేషన్‌ వ్యూహాలను రూపొందించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా 1,28,589 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను వెలువరించింది. గ్రామ సచివాలయాల్లో 95,088, వార్డు సచివాలయాల్లో 33,501 ఉద్యోగాలు ఉన్నాయి. పరీక్ష సెప్టెంబరు 1న జరగవచ్చని ప్రకటించారు. అక్టోబరు 2 నాటికి విధుల్లో చేర్చాల్సి ఉంది. సిలబస్‌ను పరిశీలిస్తే ‘నెల రోజుల్లో ఇంత సిలబస్‌ని చదివి ఏ విధంగా పోస్టు సంపాందించుకోవాలి?’ అనే సందేహంతో చాలామంది అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాలుగంచెల విధానాన్ని అనుసరిస్తే విజయావకాశాలను మెరుగు పరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యేక సబ్జెక్టుపై దృష్టి 

మొదటి అంచెలో నోటిఫికేషన్లో ఎంపిక చేసుకున్న పోస్టుకు సంబంధించిన ప్రత్యేక సబ్జెక్టుపై ముందుగా పట్టు సాధించాలి. గెలుపు బాటలో ఇదే తొలి అడుగు అవుతుంది. ఇక్కడ అభ్యర్థుల మధ్య పోటీని తగ్గించడంలో ప్రత్యేక సబ్జెక్టు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అందువల్ల సిలబస్‌లో ఇచ్చిన ప్రత్యేక సబ్జెక్టు అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి మొత్తం ప్రిపరేషన్‌లో సగానికి పైగా సమయాన్ని దీనికి వినియోగించాలి.

నిర్దిష్ట అంశాలకు ప్రాధాన్యం

రెండో అంచెలో జనరల్‌ స్టడీస్‌లోని నిర్దిష్ట అంశాలకి తొలి ప్రాధాన్యమివ్వాలి. గతంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయిన వారికి ఈ సిలబస్‌ కొంతవరకు సులభంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం, పరీక్షను బట్టి ఆ స్థాయిలో చదవాల్సిన అవసరం లేదు. అంటే సీనియర్‌ అభ్యర్థులు మళ్లీ పాత సిలబస్‌ ఆధారంగా చదివిన పాఠాలను యథాతథంగా చదవాల్సిన అవసరం లేదు. సిలబస్‌లో ఒక్కొక్క విభాగంలో కొన్ని ప్రత్యేకమైన పాఠాలను పేర్కొన్నారు. అందువల్ల ఆ విభాగంలో ఆ పాఠాల వరకే పరిమితమైతే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

‘ఇంత సిలబస్‌లో ఏ భాగం నుంచి ఎన్ని ప్రశ్నలు ఇస్తారు?’ అనేది అంచనా వేయడం అంత తేలిక కాదు. గతంలో చదివిన పాఠాల అనుభవంతో సీనియర్లు రాణించే అవకాశం ఉంది. కొత్తగా ప్రిపరేషన్‌ ప్రారంభించే అభ్యర్థులకు సిలబస్‌ని అర్థం చేసుకోడానికే చాలా వ్యవధి పడుతుంది. నిపుణులు, సీనియర్ల సహకారంతో పరీక్ష కోణంలో ముఖ్య అధ్యాయాలను ప్రాధాన్య క్రమంలో ప్రిపేర్‌ అవడం తాజా అభ్యర్థులకు మంచిది. అదృష్టం పాత్ర ఎక్కువగా కనిపిస్తున్నా సరైన వ్యూహంతో గరిష్ఠ మార్కులు సాధించే అవకాశం కొత్త అభ్యర్థులకూ ఉంది.

ఆంగ్లం, కంప్యూటర్‌పై అవగాహన 

మూడో అంచెకు సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించిన సిలబస్‌లో జనరల్‌ స్టడీస్‌ కింద జనరల్‌ ఇంగ్లిష్, కంప్యూటర్‌ పరిజ్ఞానం విభాగాలు ఉన్నాయి. సాధారణంగా జనరల్‌ ఇంగ్లిష్‌లో అభ్యర్థులు తక్కువ మార్కులు పొందుతున్నారు. తాజా అభ్యర్థులైతే మొదటి రెండు అంశాలపై పట్టు సాధించిన తర్వాత మిగతావాటిపై అవగాహన సాధించే ప్రయత్నం చేయవచ్చు. సీనియర్లు చాలామందికి వాటిపై సరైన పట్టు ఉండదు కాబట్టే వీటిలో సాధించే మార్కులు విజయానికి చాలా దోహదపడతాయనటంలో సందేహం లేదు. కంప్యూటర్‌ పరిజ్ఞానానికి సంబంధించిన ప్రాథమిక మౌలిక అంశాలను కచ్చితంగా ప్రశ్నల రూపంలో ఆశించవచ్చు. కాబట్టి మెరుగైన స్థాయిలో ప్రిపేర్‌ కావడానికి ఇదో సరైన మార్గంగా చెప్పవచ్చు.

వర్తమాన ఆధారిత అధ్యయనం 

నాలుగో అంచెను పరిశీలిస్తే ఎప్పటినుంచో గ్రూప్‌ 1, 2 పంచాయతీ కార్యదర్శి లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ముందుగా ప్రాధాన్య క్రమంలో వివిధ విభాగాలపై (తాజా అభ్యర్థులకు సూచించినవి) పటిష్ఠమైన అవగాహన పెంచుకోవాలి. గత అనుభవాల వల్ల తొందరగానే వీరికి పట్టు చిక్కుతుంది. దీంతో సిలబస్‌లో మిగిలివున్న అంశాలపై దృష్టి సారించవచ్చు. అందులో భాగంగానే భారతదేశ చరిత్ర, భారత ఆర్థిక వ్యవస్థ, నిత్యజీవితంలో శాస్త్ర సాంకేతిక విషయాలు, సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాల్ని చదవవచ్చు. ఈ అంశాల్లో ఎక్కువ కరెంట్‌ అఫైర్స్‌ ఆధారిత ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆ కోణంలోనూ అభ్యర్థులు సంసిద్ధం కావాలి.



తాజా అభ్యర్థులు తెలుసుకోవాల్సినవి:

జనరల్‌ స్టడీస్‌ విభాగానికి వస్తే.... లభ్యమవుతున్న ఈ కొద్ది సమయంలో కింది అంశాలపై దృష్టి నిలిపితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.

1. జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌: దీనిలో ప్రశ్నలను గ్రూప్‌ 1, 2 స్థాయి మాదిరిగా కాకుండా దాదాపుగా బేసిక్‌ స్థాయిలో అడిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రాథమిక జ్ఞానానికి సంబంధించిన అంశాలతో సాధన చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. బ్యాంకు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఎగ్జామ్‌ మాదిరిగా లోతైన ప్రిపరేషన్‌ అవసరం ఉండకపోవచ్చు. ప్రతి రోజూ గంట సమయాన్ని ఈ విభాగానికి కేటాయిస్తే తేలికగా మార్కులు సాధించవచ్చు.

2. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు: గత ఆరు నెలల్లో జరిగిన అంశాలపై దృష్టి పెడుతూ క్రమం తప్పకుండా అంతర్జాతీయంగా, జాతీయంగా జరుగుతున్న ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలి. ఫలితంగా ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు.

3. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకాలు: ప్రస్తుత ధోరణిని బట్టి ఎక్కువ స్థాయిలో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాల నుంచి అడగటానికి అవకాశం ఉంది. కొద్దిరోజులుగా కొత్త ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలపై ప్రభుత్వ సమాచారం ఆధారంగా సిద్ధమైతే మంచి మార్కులు సాధించవచ్చు.

4. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలు: పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాల నుంచి సులభమైన ప్రశ్నలను ఆశించవచ్చు. స్వల్పకాలంలో అధిక మార్కులు తెచ్చుకోగలిగిన విభాగం ఇది. పాఠశాల స్థాయి పుస్తకాల్లోని ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికానికి సంబంధించి భౌతిక, ఆర్థిక అంశాలపై శ్రద్ధ తీసుకుంటే మార్కులు సంపాదించుకోవచ్చు.

5. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర: ఈ విభాగం నుంచి కూడా ఎక్కువసంఖ్యలో ప్రశ్నలు ఆశించవచ్చు. ముఖ్యంగా ఈ కొద్ది సమయంలో చిన్న చిన్న రాజ్య పరిపాలనలను పక్కన పెట్టాలి. ప్రధానంగా శాతవాహన రాజ్య వంశ చరిత్ర, విజయనగర ప్రభువుల పాలన, చోళులు , చాళుక్యులు, పల్లవుల పరిపాలనా యుగాలు , స్వాతంత్య్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటనలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు మొదలైన కొద్ది అంశాలకు పరిమితమవ్వాలి. వివిధ రకాలైన కళల్లో, సాహిత్యంలో రాణించిన ప్రముఖ వ్యక్తుల గురించి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.

6. విభజనానంతర సమస్యలు: ఇవి ప్రస్తుత సిలబస్‌లో కూడా ప్రాధాన్యం పొందాయి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వివిధ విభజన సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న సహకార ధోరణిపై ప్రశ్నలు రావచ్చు. ఈ విభాగం నుంచి 3-5 ప్రశ్నలను ఆశించవచ్చు.

7. వికేంద్రీకృత పరిపాలన: ప్రస్తుత ఈ ఉద్యోగాల వెల్లువ గ్రామ, వార్డు పరిపాలన కేంద్రాలుగా జరుగుతుంది. గ్రామస్థాయి పరిపాలన, వార్డు స్థాయి పరిపాలనలను బలోపేతం చేయటం ఈ ప్రయత్నం వెనుకున్న నేపథ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వికేంద్రీకృత పరిపాలనపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పడిన పరిపాలన వ్యవస్థపై ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గ్రామ సచివాలయంలో, వార్డు సచివాలయంలో నియమించబోతున్న ఉద్యోగులు ప్రజలకు ఏవిధమైన సేవలు అందించాల్సి ఉంటుందనేది ముందస్తుగానే ఈ పరీక్ష ద్వారా తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. అందుకే పాలిటీ, గవర్నెన్స్‌ అనే విభాగం కింద 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పడిన పరిపాలనా యంత్రాంగం, రాజ్యాంగ నిబంధనలపై కచ్చితంగా ప్రశ్నలను ఆశించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తగిన రీతిలో అభ్యర్థులు సిద్ధపడాలి.

కొత్తగా ప్రిపరేషన్‌ను ప్రారంభించిన అభ్యర్థులు ఇంతకుమించిన అంశాలపై ప్రస్తుత పరిస్థితుల్లో సన్నద్ధత కొనసాగించడం దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మొదటి అంచె, రెండో అంచెలో ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకొని గట్టిగా ప్రిపేర్‌ అయితే విజయావకాశాలు చాలా వరకు మెరుగుపడతాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 10, 2019.


0 comments:

Post a Comment