జియో మరో బంపర్‌ ఆఫర్‌

జియో మరో బంపర్‌ ఆఫర్‌
Image result for JIO




ముంబయి: రిలయన్స్‌ జియో కస్టమర్లకు మరో శుభవార్త. నేటితో జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ముగుస్తున్న నేపథ్యంలో చివరి క్షణంలో దాన్ని మరో 15 రోజులపాటు కంపెనీ పొడిగించింది. వినియోగదారుల నుంచి వస్తున్న విశేష ఆదరణే దీనికి కారణమని సంస్థ ప్రకటించింది. రూ.99తో జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ గడువు మార్చి 31తో తీరిపోనుంది. అయితే దీన్ని తాజాగా ఏప్రిల్‌ 15 వరకూ పొడిగించారు. ఇప్పటి వరకు 7కోట్లకు పైగా ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్నారని సంస్థ వెల్లడించింది.
రూ.303తో మూడునెలలు!
ఇది వరకు ఉన్న ఆఫర్‌ ప్రకారం రూ.303తో రీఛార్జి చేసుకుంటే ఒకనెల మాత్రమే వాయిస్‌, డేటా సేవలు లభించేవి. తాజా నిర్ణయంతో దాన్ని మూడు నెలలకు పెంచారు. దీంతో జూన్‌ చివరి వరకూ ఉచిత డేటా, వాయిస్‌ సేవలను జియో వినియోగదారులు పొందనున్నారు.
అదే కారణమా?
తొలుత ప్రకటించిన ప్రకారం నేటితో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ముగుస్తుండటంతో ఆన్‌లైన్‌లో మెంబర్‌షిప్‌ను పొందేందుకు వినియోగదారులు భారీగా జియో వెబ్‌సైట్‌, యాప్‌లపై ఆధారపడ్డారు. దీంతో ఒక్కసారిగా వాటిపై లోడ్‌ పెరిగి సాంకేతిక లోపం తలెత్తింది. వెబ్‌సైట్‌, యాప్‌ నెమ్మదిగా ఓపెన్‌ కావడంతో వినియోగదారులు తీవ్ర నిరాశ చెందారు. పలువురు సోషల్‌మీడియాలోనూ, ట్విటర్‌ ద్వారా ఫిర్యాదులు నమోదు చేశారు. మరికొందరు కస్టమర్‌ కేర్‌లను సంప్రదించారు. చివరికి జియో కస్టమర్‌ కేర్‌ కాల్‌సెంటర్‌ నెంబర్లు కూడా బిజీ అని రావడం గమనార్హం. తమ వినియోగదారుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రైమ్‌ గడువు పొడిగించినట్లు భావిస్తున్నారు.